Wednesday, June 8, 2016

మృగసింహావతారం

*************************************************************************************************************************************





Dr. Rukmini Devi, MD

(20 March 1950 - 09 June 2012)






మృగసింహావతారం




నాలుగేళ్ళవుతోంది.


అదే ఆరోజు. నా భార్య ద్వాదశకర్మ. హైదరాబాదు టాంక్ బండు పక్కన ఉన్న

భారతసేవాశ్రమసంఘం పూజాగృహములో.


అందులో నాకేమీ ప్రమేయం లేదుగా. అంతా పాపం మా అబ్బాయి పై బాధ్యత

పడింది. ఒక్కగానొక్కడు. చిన్నవాడు. ముద్దుగా పెరిగాడు. అదీ బెంగాలులో.

తతంగాలు అలవాటు లేదు. ఈగోచి పోసి ధోవతి కట్టుకోడం, పబ్లికుగా కొళాయికింద

పదేపదే స్నానాలు చేయడం, గుండుకొట్టించుకోడం, ధూపాలూ దీపాలూ హోమాలూ

పొగలూ, కళ్ళు నులుముకోడాలూ, కాళ్ళు కడగడాలూ ఇంకా ఎన్నో ఎన్నో. చేసేది

మల్టీనేషనల్లో ఉద్యోగం. వారానికి నాలుగు రోజులు టిప్టాపుగా తయారవడం,

ఐదవరోజు జీన్సూ టాపులూ. ఏసీ కారులూ, ఏసీ రూములూ, ఏసీ ఆఫీసులూ.


నాకేం. దర్జాగా పేంటూషర్టూ వేసుకొని బయట షామియానాలో కుర్చీమీదకూర్చుని

కబుర్లుచెప్పడం. వచ్చేపోయే వాళ్ళను పల్కరించడం. పిలిచినప్పుడు

లోపలికిపరిగెట్టి అక్షింతలువేసి బయటపడ్డం. నాలుగు జేబూల్లోనూ పదేసి వేలు

కుక్కుకొని సింహం గారు అడిగినప్పుడల్లా విదజల్లుతుండడం. మరి ఇది కాంట్రాక్టు

కర్మకాండ కదా. దహనం నించీ వైకుంఠసమారాధన వరకూ లక్షాఇరవై వేలు.

అన్నిఏర్పాటులూ సింహంగారివే.


సింహం గారి అసలు పేరు చాలామందికి తెలీదు. ఇది మినిష్టరు గారు

ఆయనకిచ్చిన బిరుదట. ఒడ్డూ పొడుగూ చాలా ఠీవిగా ఉంటాడు. మితభాషి. యాభై

యేళ్ళు దాదాపు. కంఠంలో నిగనిగలాడే బంగరు చైను. వేళ్ళకు నవరత్నాల

ఉంగరాలూ. చేతిలో సెల్ ఫోను అస్తమానం రింగ్ అవుతూనే ఉంటుంది. ఈయన

ప్రధాన పురోహితుడు. ఈయన కిందపనిచేసే పదిమంది వాధ్యారులు. సీమంతం

నుండి స్మశాన కర్మల వరకూ అన్ని కార్యాలూ ఇట్టే చేయిస్తారు. యజ్ఞాలూ యాగాలూ

కూడా. తమ్ముళ్ళూ మరుదులూ మేన ల్లుళ్ళూ వీరి పంచన ఉండి పౌరోహిత్యం

నేర్చుకున్న వాళ్ళే. చుక్కల్లో చందమామలా రాణిస్తుంటారు. వేదాలలోని రుక్కులూ

పనసలూ ఇట్టే వల్లించగలరు.


వీరొకసారి మినిష్టరు గారిచే యాగం చేయించి కానుకలు స్వీకరించి తమ

 మారుతి డొక్కు కారులో కిక్కిరిసిగా కూరి వీడ్కోలు చెబుతుంటే మినిష్టరు గారు ఆపి

ఒక సరికొత్త బొలెరో గిఫ్టిచ్చారట.


ఒంటిగంట అవుతోంది. దానాలు చేయించే పని దగ్గర పడుతోంది. గోదానం,

భూదానం, వస్త్రదానం, స్వర్ణదానం, ధాన్యదానం ఇంకా ఎ న్నెన్నో. కన్యాదానం

మినహా. అన్నీ ఫేకు దానాలే. రీసైకిల్ సరుకులు.


దానాలు పుచ్చుకునే పంతుళ్ళు తొందరపడుతున్నారు. వారి గుసగుసలూ

 రుసరుసలూ పెరుగుతూంటే నాపక్కన కూచుని కబుర్లు చెప్పే సింహం గారు

చటుక్కున లేచి లోపలికెళ్ళారు. ఒక్క గర్జన మారుమోగింది ఆశ్రమంలో:


'పాపం కర్తగారు చిన్నవారు. తొందరపడకండి. అంత తీరిక లేకపోతే తోకలు ముడిచి

 పారిపొండి. ఒక్క ఫోను కొడితే పదిమంది పంతుళ్ళు రెక్కలుకట్టుకొని వాల్తారు.'


సింహం గారి గర్జనతో ఆశ్రమమంతా దద్దరిల్లింది. అందరూ గప్చుప్. అప్పుడర్థమైంది

వారికి సింహం అని బిరుదు ఎందుకిచ్చారో.


ఒక్క నిమిషం కాగానే సింహం గారు వచ్చి నాదగ్గర కూర్చున్నారు. ఇంతలో నాకు

లోపలనించి పిలుపు వచ్చింది. అక్షింతల పని. లేచి చెప్పులు గది బయట వదిలి

లోపలికి వెళ్ళి మరుక్షణం వాపసు వచ్చి చెప్పులు తొడిగి సింహం గారి పక్కన

కూర్చున్నాను.


వారు తదేక్షగా నా చెప్పులు చూస్తూ ఇలా అన్నారు:


'చెప్పులు కొత్తవిలా ఉ న్నాయి. నిగనిగ మెరుస్తున్నాయి.'


'అవునండీ. నిన్ననే కొన్నాము.'


'ఎంతయినాయి?'


'అక్షరాలా పదిహేను వందలు.'


'అమ్మో! చెప్పుల మీద అంత ఖర్చు చేశారా!'


'నా మొహం. నాకెక్కడివండీ అన్ని డబ్బులు! నేను పెన్షనర్ని. మా కొడుకూ కోడలూ

పట్టు బట్టి నాకు గిఫ్టిచ్చారు. ఏనాడూ వంద రూపాయలకన్నా చెప్పుల మీద ఖర్చు

చేయలేదు. చిన్నప్పటినించీ రిపేర్ల బాపతే. పైగా పాత చెప్పులూ పాత భార్యా

పాదరక్షణకూ ఆత్మరక్షణకూ బాగా అన్యోన్యంగా సూటవుతాయిగా. నిన్న

సాయంత్రం మా అబ్బాయి పద పోదాం బయటికి అన్నాడు. సరే నని అందరం

బయలుదేరాం. తిన్నగా కారుని బాటా షాపు దగ్గర పార్క్ చేసి లోపలికి లాక్కెళ్ళాడు.

 నన్ను కూచోబెట్టి ఇలాంటి విలువైన పది జతలు తెచ్చాడు. నాకెందుకురా కొత్త

చెప్పులు. నావి లక్షణంగా ఉన్నాయికదా అన్నాను. కాదూ కూడదూ అన్నాడు. నిన్న

ఉదయం మా కోడలు ఇల్లు ఊడుస్తూ కొద్దిగా చిరిగిన నా పాత చెప్పులు చూసి భర్తకు

పురమాయించిందట…నేను లేచి వెళ్ళి పోబోయాను. ఇంతలో కోడలు “మామయ్యా”

అని ఆప్యాయంగా చూసింది. ఆమె ఆప్యాయతతో నేను ఐసయిపోయాను. అంతే.

ఇన్నాళ్ళూ నా జోళ్ళు నా పాదరక్షలుగా ఉండేవి. ఇప్పుడు నేను నా  

పాదుకారక్షకుడనయ్యాను!’ అన్నాను నవ్వుతూ.


సింహం గారు మరి మాట్లాడలేదు…


దానాలూ ధర్మాలూ పూర్తయ్యాయి. వేదపారాయణకూ ఆశీర్వాదానికీ టైమయింది.

అందరూ హాల్లోకి వెళ్ళి కూచున్నారు. నలుగురు వేదపండితులు

అనర్ఘళంగా పనసలు పాడారు. అందులో కంచు కంఠం సింహం గారిదే. అది

పూర్తయ్యాక ఓదార్పూ అశీర్వచనం జరుగుతోంది. ముగ్గురు పండితులు కొడుకూ

కోడలునూ ఆశీర్వదించి కోడలి వేపు చూస్తూ ఇలా పలికారు:


‘బాల్యంలో తల్లిని, వార్ధక్యంలో భార్యని కోల్పోడం అతికష్టం అంటారు. ఈపైన నీవు

నీ మామయ్య గారిని నాలుగు కళ్ళతో చూసుకోవాలి.  వారి కష్ట సుఖాలు ఇక నీవే

కనిపెట్టి ఉండాలి.’


ఇలా ఇలా బోధనలు చేశారు…


ఇక సింహం గారి వంతు వచ్చింది.


కంఠీరవం గారి కంఠం గద్గదమైంది:


'ఈ పసిడి యువతికి నేనేమీ పాఠాలు చెప్పనక్కర లేదు. ఇలాంటి కోడలు దొరకడం

శాస్త్రి గారి అత్యదృష్టం.'


అంటూ నా కొత్త చెప్పుల కథ టూకీగా చెప్పారు.


వారి కళ్ళు చెమ్మగిల్లాయి.


అప్పుడనుకున్నాను... ఈ సింహ హృదయంలో హరిణి దాగి ఉందని...

-----------------------------------------------------------------------------------------------










...Posted by Ishani


**************************************************************************************************************************************

5 comments:

G P Sastry (gps1943@yahoo.com) said...

Sri BVS Prasad writes:


కనులు చెమర్చే ఆప్యాయతలు ఎదురైతే సింహం మనసు కరుగుతుంది.. చిన్నప్పటి ఆవు కథలోనూ అంతే .. మంచి మనసుల మమతల పందిరి వంటి మీ పిల్లలకు అశీస్సులు. ధన్యులగు మీకు నమస్సులు !

G P Sastry (gps1943@yahoo.com) said...

Sri Mamillapalii Adinarayana Murty writes:

Dear Sir,

Your excellent narration remembering your wife's annual ceremony is heart rending, though you have given your natural humorous touch to it.

Regards....
-M A Murty

Zilebi said...


మీ బ్లాగు బాగుందండీ !

జిలేబి

కంది శంకరయ్య said...

నిస్సందేహంగా మీలో మంచి కథకుడు ఉన్నాడు. మీ ఇషానీ బుక్స్ చూసినప్పుడే అర్థమయింది. తెలుగులో అటువంటి రచనలు ఎందుకు చేయలేదా అని సందేహం కలిగింది. ఇది ఆ లోటు తీర్చింది. ఇలాంటివి మీరింకా వ్రాసి ఉండవలసింది. గద్య పాఠకుల దురదృష్టమో, మా అదృష్టమో పద్యం వైపు దుమికారు. పద్యమైనా గద్యమైనా చక్కని హాస్య ధోరణితో వ్రాసున్నారు. సంతోషం!

G P Sastry (gps1943@yahoo.com) said...

మీ వలలో చిక్కుకన్న చేప పని గోవిందా గోవింద!!!

__/\__